న్యూ ఢిల్లీ – భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా నలుగురు సభ్యుల బృందం చేపట్టనున్న యాక్సియమ్-4 (ఏఎక్స్-4) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) యాత్ర వాయిదా పడింది. నిజానికి ఈ నెల 29న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా దానిని జూన్ 8వ తేదీకి మార్చినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి. భారత కాలమానం ప్రకారం జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
వాయిదా పడింది ఇందుకే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఫ్లైట్ షెడ్యూల్ను సమీక్షించిన అనంతరం నాసా, దాని భాగస్వామ్య సంస్థలు రాబోయే కొన్ని మిషన్ల ప్రయోగ తేదీలలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. “కార్యకలాపాల సంసిద్ధతను బట్టి, యాక్సియమ్ మిషన్ 4 ప్రయోగానికి కొత్త తేదీ జూన్ 8, ఉదయం 9:11 (తూర్పు అమెరికా కాలమానం)” అని నాసా తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.
మిషన్ బృందం.. ప్రాముఖ్యత
భారత్ కు చెందిన శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్న ఈ యాత్రలో పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ దేశాల చరిత్రలో ఇది మొట్టమొదటి ఐఎస్ఎస్ యాత్ర కావడం విశేషం. అలాగే, ప్రభుత్వ ప్రాయోజిత మానవసహిత అంతరిక్ష యాత్రల్లో 40 ఏళ్ల తర్వాత ఇది రెండోది. ఈ బృందంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్స్కి (పోలాండ్, 1978 తర్వాత రెండో వ్యోమగామి), టిబోర్ కపు (హంగేరీ, 1980 తర్వాత రెండో వ్యోమగామి) ఉన్నారు. అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ వాణిజ్య మానవ సహిత అంతరిక్ష యాత్రకు కమాండర్గా వ్యవహరించనున్నారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన అమెరికన్ వ్యోమగామిగా ఆమె ఇప్పటికే రికార్డు సృష్టించారు.
శుక్లా ప్రయోగాలు.. భారత్ లక్ష్యాలు
నాలుగు దశాబ్దాల క్రితం 1984లో రష్యాకు చెందిన సోయుజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు శుభాంశు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలో శుక్లా ఏడు కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. భారతదేశంలో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనలను ప్రోత్సహించడం ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని, 2047 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇస్రో కూడా ఐఎస్ఎస్లో ప్రయోగాల కోసం భారత్కు సంబంధించిన ఆహార పదార్థాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులలో మెంతి, పెసర మొలకలను పెంచే ప్రయోగాలు చేపట్టనుంది. యాక్సియమ్-4 బృందం స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించి, అక్కడ 14 రోజుల వరకు ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది.