సీఎం రేవంత్పై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్
కొండల్రెడ్డి కంపెనీపై క్రిశాంక్ సంచలన ఆరోపణలు
‘రూ.లక్షతో ప్రారంభమైన సంస్థకు రూ.కోటి విదేశీ మారకద్రవ్య ఆదాయమెలా?’
‘కంపెనీకి డీపీఐఐటీ గుర్తింపు లేదు.. ఒక్క ఉద్యోగి కూడా లేరు’
సీఎం సోదరుడి కంపెనీకి రూ.100 కోట్ల భూమిని రూ.7 కోట్లకే ఇచ్చారంటూ విమర్శలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు అనుముల కొండల్రెడ్డికి చెందినదిగా పేర్కొంటున్న టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కంపెనీకి సంబంధించిన పలు పత్రాలు, వివరాలను ప్రస్తావిస్తూ.. సంస్థ కార్యకలాపాలపై అనేక సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై కంపెనీ లేదా కొండల్రెడ్డి నుంచి వివరణ వెలువడాల్సి ఉంది.
కంపెనీలకు సంబంధించిన పబ్లిక్ డేటాబేస్లో టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నమోదై ఉన్నట్లు కనిపిస్తోంది. పటాన్చెరువు పరిధిలోని శ్రీకృష్ణనగర్ చిరునామా కూడా నమోదై ఉంది. అలాగే ఇండియా-యూఎస్ ఫోరం వెబ్సైట్లో కొండల్రెడ్డిని టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చైర్మన్గా పేర్కొంది.
‘రూ.లక్షతో ప్రారంభమై.. రూ.కోటి విదేశీ ఆదాయమా?’
కంపెనీ కేవలం రూ.లక్ష మూలధనంతో ప్రారంభమైందని క్రిశాంక్ పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ చేస్తామని చెప్పుకునే సంస్థకు అవసరమైన డీపీఐఐటీ గుర్తింపు లేదని ఆయన ఆరోపించారు. ఎలాంటి తయారీ కార్యకలాపాలు నిర్వహించకుండానే రూ.కోటి మేర విదేశీ మారకద్రవ్య ఆదాయం వచ్చినట్లు పత్రాల్లో చూపించారని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని, పటాన్చెరువులోని శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంటి చిరునామా నుంచే సంస్థను నిర్వహిస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ సంస్థగా పేర్కొంటున్న కంపెనీ కార్యకలాపాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
‘రూ.100 కోట్ల భూమి.. రూ.7 కోట్లకే?’
కొండల్రెడ్డికి చెందినదిగా పేర్కొంటున్న కంపెనీకి రూ.100 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టారని క్రిశాంక్ మరో ఆరోపణ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ.. ప్రభుత్వం, అధికారులు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ కంపెనీని అడ్డుపెట్టుకుని అమెరికాకు చెందిన వారితోనూ కొండల్రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, భూమి కేటాయింపు, విదేశీ మారకద్రవ్య ఆదాయానికి సంబంధించిన వివరాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
‘ఫోర్త్ సిటీ పేరుతో ప్రచారమే’
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ఫోర్త్ సిటీ’, ‘ఫ్యూచర్ సిటీ’ పేర్లతోనే ఎక్కువగా ప్రచారం జరుగుతోందని క్రిశాంక్ విమర్శించారు. సమీక్ష సమావేశాలు, పెట్టుబడుల సదస్సులు, బహిరంగ సభల్లో వీటి గురించే మాట్లాడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో సీఎం కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శించారు.
గతంలోనూ కొండల్రెడ్డికి సంబంధించి ఇసుక వ్యవహారంపై మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్రవరిలో ఆయన కొండల్రెడ్డిపై ఇసుక వ్యాపారానికి సంబంధించి పలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను అధికార పక్షం ఎలా స్పందించిందన్నది అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది.
‘దుర్వినియోగం కాదు.. దోపిడీ’
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారన్న కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును ప్రస్తావించిన క్రిశాంక్.. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కార్యాలయాన్ని ఉపయోగించుకుని కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
‘షెల్ కంపెనీల పేరుతో కోట్ల విలువైన భూములను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు’ అంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు పూర్తి వివరాలను వెల్లడించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ మూలధనం, కార్యకలాపాలు, ఉద్యోగుల వివరాలు, విదేశీ ఆదాయం, భూమి కేటాయింపుపై క్రిశాంక్ లేవనెత్తిన ప్రశ్నలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలపై సంబంధిత సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే వివరణతోనే ఈ వ్యవహారంలో వాస్తవాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
సోదరుడి కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని కేటాయించి.. రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్.. ఇది అవినీతి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
