శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విషాదం..
ప్రయాణికుడు మృతి
ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన కేరళ వాసి
దుబాయ్ నుంచి కొచ్చిన్ వెళ్తుండగా ఘటన.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
శంషాబాద్, ఆంధ్రప్రభ: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి కొచ్చిన్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన సదరు ప్రయాణికుడు దుబాయ్ నుంచి కొచ్చిన్ వెళ్లే ప్రయాణంలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద తనిఖీల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. తీవ్ర అనారోగ్య సమస్య కారణంగా ఆయన మృతి చెంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆస్పత్రికి తరలించేలోపే..
ప్రయాణికుడు కుప్పకూలడంతో వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది, వైద్య బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే ప్రాథమిక వైద్య సహాయం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసుల దర్యాప్తు
ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మృతికి గల కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
