జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఆగస్టు 25 వరకు పొడిగింపు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు.. యాకూబ్ పాషా వెల్లడి
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా తెలిపారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించినట్లు పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా ఇప్పటికే పలువురు జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు ప్రతివాదులు కోర్టుకు తెలియజేశారని, వాటి పూర్తి వివరాలు, జాబితాను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపారు.
అలాగే తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన తుది వాదనలు ప్రారంభమవుతాయని, అంతకుముందే ఇరు పక్షాలు సంబంధిత పత్రాలు, ఆధారాలను కోర్టులో దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
తుది తీర్పు వెలువడే వరకు రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు తమ వృత్తిపరమైన హక్కులు, ప్రభుత్వ గుర్తింపుతో లభించే సౌకర్యాలను యథావిధిగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎండీ యాకూబ్ పాషా పేర్కొన్నారు.
