AP | డీఎస్సీ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం…

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.

వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. డీఎస్సీ నియామకాల్లో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. అయితే, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని భావించే సంబంధిత అభ్యర్థులే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. అభ్యర్థులు భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనను కోర్టు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనతో దాఖలైన పిల్‌ను తిరస్కరించిన హైకోర్టు.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం ముగిసింది.