డీఏపీ బస్తాలకు లింకు విక్రయాల ఆరోపణలు

అవసరం లేని ఉత్పత్తులు కొనాలని ఒత్తిడి చేస్తున్నారంటూ రైతుల ఆవేదన

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని రైతులకు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఎరువుల కొరత సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సకాలంలో కురవకపోవడం, మరోవైపు యూరియా, ఇతర ఎరువుల ధరలు పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రంలో డీఏపీ బస్తాల కోసం రైతులు బారులు తీరారు. అయితే, ఇతర పురుగు మందులు లేదా ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే డీఏపీ బస్తాలు ఇస్తున్నారని కేంద్ర నిర్వాహకులపై రైతులు ఆరోపించారు.

తమ పంటకు అవసరమైన ఎరువులు, పురుగు మందులనే కొనుగోలు చేస్తామని, అవసరం లేని ఉత్పత్తులను లింకు పేరుతో బలవంతంగా కొనుగోలు చేయించడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు ఈ విషయంపై నిర్వాహకులను నిలదీయగా, మరికొందరు ప్రత్యామ్నాయం లేక కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా డీఏపీ బస్తాలను ఎమ్మార్పీ ధరకే, ఎలాంటి లింకు విక్రయాలు లేకుండా అందుబాటులో ఉంచాలని బాధిత రైతులు పిట్టల రామచందర్, బుర్ర మురళి, కట్కూరి సారయ్య, ఉప్పుల రవీందర్, కొత్తకొండ రాజు, ఉమ్మనవేని రాజయ్య తదితరులు డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లేదా లింకు విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.