పెనుగంచిప్రోలులో సెక్షన్ 30 అమలు….
అనుమతి లేనిదే సభలు, ధర్నాలు నిషిద్ధం..
ఎస్ఐ అర్జున్ హెచ్చరిక
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలు ఎటువంటి బహిరంగ సభలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అనుమతి తప్పనిసరి…. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు లేదా ఊరేగింపులు చేపట్టాలన్నా ముందస్తుగా పోలీసు వారి నుంచి ఖచ్చితమైన లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలను ఉల్లంఘించి, ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి మీటింగ్లు నిర్వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు, ప్రజల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. కావున స్థానిక నేతలు, ప్రజాసంఘాలు, గ్రామ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి, చట్టాన్ని గౌరవించాలని ఎస్ఐ అర్జున్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
