MBNR | రైతుల మేలు కోసం భూ భారతి.. తూడి మేఘా రెడ్డి

వనపర్తి ప్రతినిధి, ఏప్రిల్ 22(ఆంధ్ర ప్రభ): గత ప్రభుత్వం 18లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణి చట్టాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళాఖాతంలో వేయడం జరిగిందని, ధరణి స్థానంలో రైతులకు మేలు చేసే రైతు పక్షపాతి అయిన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం గోపాల్ పేట, రేవల్లి, ఎదుల మండల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం – 2025 అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధరణి చట్టం ద్వారా ఏర్పడిన సమస్యలు ఏమిటి, భూ భారతి చట్టం వల్ల కలగనున్న లాభాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రతి మండలంలో రైతులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధరణి చట్టం ప్రకారం తహసీల్దార్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే అందులో తప్పులున్నా, ఏ సమస్య ఉన్నా తిరిగి సరి చేసేందుకు తహసీల్దార్ కు గానీ, ఆర్డీఓ లేదా కలెక్టర్ కు సైతం అధికారం లేకుండా ఉండేదని గుర్తు చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడ్డాయని, సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అయినప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. సమస్యలుంటే ఆర్డీఓ, కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే రెండంచెల అప్పీల్ వ్యవస్థ భూ భారతి చట్టంలో కల్పించడం చాలా కీలకమన్నారు.

భూ భారతి చట్టం గురించి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం సైతం ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, గోపాల్ పేట తహసీల్దార్ తిలక్ రెడ్డి, రేవల్లి తహసీల్దార్ లక్ష్మీ, కాంగ్రెస్ నాయకులు సత్య శీలారెడ్డి, మండల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply