స్త్రీ నిధి రికవరీ, రుణాల పంపిణీ 100 శాతం చేయాలి..
స్త్రీ నిధి రికవరీ, రుణాల పంపిణీ 100 శాతం చేయాలి..
- మన స్త్రీ నిధి యాప్ వినియోగం తప్పనిసరి
- నెలాఖరుకల్లా రికవరీ, క్రెడిట్ లక్ష్యాల్లో పురోగతి సాధించాలి.
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : స్త్రీ నిధి రికవరీని 100 శాతానికి పెంచడంతోపాటు రుణాల పంపిణీని శత శాతం పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన నిర్వహించిన స్త్రీ నిధి జిల్లా సమీక్షా సమావేశం లో రికవరీ, రుణాల పంపిణీ, డిజిటల్ సేవల వినియోగం, సుస్థిర జీవనోపాధులు, ఆర్థిక క్రమశిక్షణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో స్త్రీ నిధి రుణ చెల్లింపులు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగాలని, అన్ని రికవరీలు మన స్త్రీ నిధి యాప్ ద్వారానే బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లావాదేవీలలో పారదర్శకత, వేగవంతమైన అడ్జస్ట్మెంట్, సమగ్ర సమాచార నిర్వహణ కోసం అన్ని స్థాయిలలో యాప్ వినియోగాన్ని మరింత విస్తరించాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడే ఎల అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని స్వయం సహాయక సంఘాలపై అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. రికవరీతో పాటు ఇతర విధుల నిర్వహణలో స్త్రీ నిధి, సెర్చ్, మెప్మా సిబ్బందికి అన్ని స్థాయిలలో పూర్తి సహకారం అందించాలని, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
జూన్ నెలాఖరు నాటికి జిల్లా రికవరీని 70 శాతానికి పెంచాలని, క్రెడిట్ లక్ష్యాన్ని కనీసం 30 శాతానికి చేరేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జీవనోపాధి రుణాల మంజూరును పెంచడంతో పాటు జీరో రికవరీ సంఘాల సంఖ్యను సున్నాకు తీసుకురావాలని సూచించారు. జూలపల్లి, ఎలిగేడు, పాలకుర్తి, మంథని, ధర్మారం, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, పెద్ద పల్లి మండలాల్లో రికవరీ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరు నాటికి గణనీయమైన పురోగతి సాధించేలా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.
మహిళల సుస్థిర జీవనోపాధుల అభివృద్ధికి స్త్రీ నిధి రుణాలను సమర్థవంతంగా వినియోగించేలా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో రుణ చెల్లింపులు, క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి సహకారం అందించడం అవసరమన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ కాళిందిని, ఏడీఆర్డీఓ రవీందర్, స్త్రీనిధి ఆర్ఎం ఆర్.దుర్గా ప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యకురాలు స్వప్న, కార్యదర్శి శోభా, కోశాధికారి స్వప్న, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, వివిధ శాఖల అధికారులు, సెర్చ్, మెప్మా, స్త్రీనిధి సిబ్బంది, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
