prices | వాహనదారులపై భారమేస్తున్న ఇంధన సంస్థలు

prices | వాహనదారులపై భారమేస్తున్న ఇంధన సంస్థలు
prices | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం నుంచి ఇంకా కోలుకోకముందే సీఎన్జీ వినియోగదారులకు మరో షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధరలను మరోసారి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కిలో సీఎన్జీపై రూ.2 పెంచినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్ ) ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.81.09 నుంచి రూ.83.09కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ నిర్వాహకులు, సాధారణ వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత మే 15వ తేదీ నుంచి ఇప్పటివరకు సీఎన్జీ ధరలు నాలుగుసార్లు పెరగడం గమనార్హం. ఈ కాలంలో మొత్తంగా కిలో సీఎన్జీపై దాదాపు రూ.4వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరల మార్పులు, సరఫరా వ్యయాల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
సీఎన్జీ ధరలు పెరగడం వల్ల ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్లు, కమర్షియల్ వాహనాల నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఛార్జీలు కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చివరికి భారం సామాన్య ప్రజలపైనే పడనుంది.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన వ్యయాలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎన్జీ ధరల పెంపు మరింత భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణహిత ఇంధనంగా భావించి సీఎన్జీ వాహనాలవైపు మొగ్గుచూపిన ప్రజలు ఇప్పుడు పెరుగుతున్న ధరలతో ఆలోచనలో పడుతున్నారు.
ఇక వరుస ధరల పెంపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీఎన్జీ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
