2027 Godavari Pushkaralu : నిజాయితీగా పని చేద్దాం Andhra Prabha Top News

2027 Godavari Pushkaralu : నిజాయితీగా పని చేద్దాం Andhra Prabha Top News
- గోదావరిలో కాలుష్యంపై సమగ్ర ఆడిట్
- సమస్య ఎక్కడుందో తెలుసుకుందాం
- అప్పుడే ఆచరణ సులభం
- ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాలకు ప్రత్యామ్నాయం అవసరం
- శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధ జలాల నిర్వహణ జరగాలి
- గోదావరి పుష్కర ఘాట్ నుంచి పడవలో ప్రయాణం
- స్వయంగా పుష్కర పనుల పరిశీలన
- రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
( ఆంధ్రప్రభ, రాజమహేంద్రవరం)

‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో సోమవారం ఉదయం 6 గంటల్ఉ పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు.
2027 Godavari Pushkaralu : ప్రతి ఖర్చు జాగ్రత్త

“గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 ఎం. ఎల్. డి. (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలి. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. అని డిప్యూటీ సీఎం ఆదేశించారు. నిధులను సత్కార్యం కోసం వినియోగించుకుందాం గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరగాలి.. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్దాం. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్. సి. పి. నిధులు రూ. 416 కోట్లలో రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాల”ని ఆదేశించారు.
2027 Godavari Pushkaralu : పేపర్ మిల్ కాలుష్యంపై ఆరా

ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల మీద ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ కృష్ణయ్య నుంచి వివరాలు అడిగారు. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా లంకల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఆలోచిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు మరో శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశానిర్దేశం చేశారు.
2027 Godavari Pushkaralu : ఆసాంతం పరిశీలన

ఆసాంతం పరిశీలిస్తూ… బోటులో ప్రయాణిస్తున్న దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే వరకు గోదావరి కాలుష్య నివారణకు తీసుకోబోతున్న చర్యలను పవన్ కళ్యాణ్ అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు వెళ్లి వేరు చేస్తున్న వ్యర్ధాలను సైతం చూశారు. ఆ వ్యర్ధాలను ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ పద్ధతి ఉపయోగిస్తున్నారని వివరాలు అడిగారు. నూతన విధానాలు వస్తున్నాయని దానికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అధికారులు సూచించారు.

అక్కడి నుంచి నేరుగా పుష్కరాల పనుల సమీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , ఎమ్మెల్సీ సోము వీర్రాజు , ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి , బత్తుల బలరామకృష్ణ , నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ , అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే , జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి , ఎస్పీ నరసింహ కిషోర్ , రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ALSO READ : 25 May Pawan : గోదారి గట్టున… పవనం Andhra Prabha Gallary
