Govindaraja Swamy : గోవిందా.. గోవింద Andhra Prabha Top News

Govindaraja Swamy : గోవిందా.. గోవింద Andhra Prabha Top News
- సింహవాహనంపై తేజోమూర్తి విహారం
- కన్నుల విందుగా బ్రహ్మోత్సవ వైభవం
- తిరుమల మాఢవీదుల్లో ఆధ్యాత్రిక శోభ
- ఈ రాత్రి ముత్యాల పందిరిలో శ్రీవారు దర్శనం
( ఆంధ్రప్రభ, తిరుమల)

Govindaraja Swamy : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి సింహవాహనంపై అభయహస్తంతో భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ దివ్య వాహనసేవలో మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేదఘోషలు, గోవిందనామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. వాహనం ముందు ఠీవిగా సాగిన గజరాజులు సేవకు మహోత్సవ శోభను చేకూర్చాయి. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామి ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
Govindaraja Swamy : అనంత తేజో మూర్తి ఆగమనం

మృగరాజు సింహం గాంభీర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. యోగశాస్త్రంలో సింహం వేగశక్తికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం. భక్తునిలో సింహ బలంలాంటి అచంచల భక్తి కలిగినప్పుడు భగవంతుని కృప ప్రసాదమవుతుందని ఆధ్యాత్మిక వాంక్యంఙ్మయం చెబుతోంది. శ్రీనివాసుడు రాక్షసుల హృదయాల్లో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడని పురాణాలు కీర్తిస్తున్నాయి. అందుకే ధీరోదాత్తుడైన శ్రీహరి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
Govindaraja Swamy : వైభవంగా తిరుమంజనం

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి , అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుండగా, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Govindaraja Swamy : ఈ రాత్రి ముత్యాల పందిరిలో..

నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్యమానంగా వెలుగొందుతుంటాడు. ముత్యపుపందిరిపై వెలసే స్వామివారి రూపం భక్తులకు మనోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యాలు చల్లదనానికి సంకేతం. సముద్రగర్భం ప్రసాదించిన అమూల్య రత్నమైన ముత్యాల కింద వెలసిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని నింపుతుందనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు ,రంజిత్, పాల్గొన్నారు.
ALSO READ : Union Minister Ram Mohan Naidu : అందరూ బాగుండాలి Andhra Prabha News
