srisailam | జెన్కో కాలనీలో చిరుత సంచారం కలకలం

srisailam | జెన్కో కాలనీలో చిరుత సంచారం కలకలం
srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలం సున్నిపెంట జెన్కో కాలనీలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటిలోకి చిరుత ప్రవేశించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
గ్రిల్లో ఉన్న కోడిని పట్టుకునేందుకు చిరుత పలుమార్లు ప్రయత్నించింది. అయితే ఇంట్లో అలికిడి కావడంతో కుటుంబ సభ్యులు లైట్లు వేయగా చిరుత అక్కడి నుంచి పారిపోయింది.


గతంలో కూడా ఇదే జెన్కో కాలనీలో చిరుత సంచరించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో అడవిలో నీటి కొరత కారణంగా వన్యప్రాణులు గ్రామాల వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో అడవుల నుంచి గ్రామాల వైపు చిరుతలు రావడం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
CLICK HERE TO READ MORE : Murder | ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
