ప్రతి ఇంటికీ విద్యా వెలుగు…

ప్రతి ఇంటికీ విద్యా వెలుగు…
2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం
విద్యా చైతన్యంతో కర్నూలు జిల్లాను అక్షరాస్యతలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మే 20 నుంచి లర్నర్ – వాలంటీర్ టీచర్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో 2029 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో అక్షరాంధ్ర రెండో దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అక్షరాంధ్ర ఫేజ్-2 కార్యక్రమం అమలు విధానం, లక్ష్యాలు, శిక్షణ షెడ్యూల్, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లాకు మొత్తం 1,87,195 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో లక్ష మంది, ద్వామా ద్వారా ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న నిరక్షరాస్య పురుషులు మరియు పొదుపు సంఘాలకు చెందిన మహిళలు కలిపి 42,195 మంది, మెప్మా ఆధ్వర్యంలో 45 వేల మంది మహిళలకు అక్షరాస్యత కల్పించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్షరాంధ్ర సెకండ్ ఫేజ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనిని ప్రతి శాఖ సమన్వయంతో విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అక్షరాస్యత కార్యక్రమం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన అక్షరాంధ్ర యాప్ ద్వారా లర్నర్లు మరియు బోధకులను అనుసంధానం చేసే ప్రక్రియను మే 20వ తేదీ నుంచి ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీలోపు పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, స్వర్ణగ్రామ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణవార్డు సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నిరక్షరాస్యుడిని గుర్తించి యాప్లో నమోదు చేయడమే కాకుండా, వారికి బోధించే వాలంటీర్లను కూడా సమర్థంగా అనుసంధానం చేయాలని సూచించారు. అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన శిక్షణ షెడ్యూల్ను ఇప్పటికే ఖరారు చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం జూన్ 23న నిర్వహించబడుతుందని, అనంతరం జూన్ 30న జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అలాగే జూలై 1 నుంచి జూలై 20 వరకు మండల స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని, జూలై 20 నుంచి జిల్లావ్యాప్తంగా అక్షరాంధ్ర తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గత ఏడాది అక్షరాంధ్ర కార్యక్రమం అమలులో కర్నూలు జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన జిల్లా అధికారులను అభినందిస్తూ, సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరినీ సన్మానించారు. ఈ సమావేశంలో డిడి అడల్ట్ ఎడ్యుకేషన్ చంద్రశేఖర్ రెడ్డి , జెడ్పి సీఈవో రమణారెడ్డి, డిపిఓ భాస్కర్, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.విజయ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, జిల్లా స్వర్ణ గ్రామ ,స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
