Maoists | ముగ్గురు జవాన్లకు గాయాలు
Maoists | ముగ్గురు జవాన్లకు గాయాలు
Maoists |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను తొలగించే సమయంలో పేలుడు సంభవించి ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఈ పేలుడు పదార్థాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.
కాంకేర్ జిల్లా చోటాబిటియా పోలీస్స్టేషన్ పరిధిలోని మర్కాబేడా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాలను టార్గెట్గా చేసుకుని మందుపాతరను అమర్చినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న డీఆర్జీ జవాన్లు అనుమానాస్పద వస్తువును గుర్తించి, దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
