No Evidence : ఆధారాలు అదృశ్యం Andhra Prabha Insight Story

No Evidence : ఆధారాలు అదృశ్యం Andhra Prabha Insight Story
నిర్దోషికి శిక్ష కాదు… ఆధారాలే కీలకం
ప్రత్యూష కేసు : 24 ఏళ్ల పోరాటం – తల్లి సరోజినీ దేవి ఆవేదన
ఆయేషా మీరా కేసు : 19 ఏళ్ల న్యాయయాత్ర ఇంకా కొనసాగుతూనే
గండికోట వైష్ణవి హత్య : వెలుగులోకి రాని నిజాలు
ఆధారాల మాయం వెనుక రాజకీయ ప్రభావమా?
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఎటు?
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
No Evidence : వంద మంది నేరాగాళ్లు తప్పించు కోవచ్చు. కానీ ఏ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదు. ఇదీ భారత శిక్షా స్మృతి లక్ష్యం. ఎంతటి కరుడు గట్టిన నేరగాడు కూడా ఒక చిన్న ఆధారాం వదిలేస్తాడు. అది చాలు అతడిని బంధించటానికి అదే అస్త్రం. ఇదీ పోలీసు బాసుల దృఢ నమ్మకం. ఇటు న్యాయవ్యవస్థకు.. అటు పోలీసు వ్యవస్థనూ ఏమార్చే నేరాల్లో ప్రావీణ్యుల ఆయుధం … అధారాలను అదృశ్యం చేయటమే. ఔను తెలుగు రాష్రాల్లో గత పాతికేళ్లుగా.. అతి కీలక హత్య, ఆత్మహత్య కేసుల్లో బాధితులకు న్యాయం కొరవడింది.

నాటి సినీ నటి ప్రత్యూష ఆత్మ ,,హత్య కేసు.. బీఫార్మశీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకేసు… నిన్నగాక మొన్న గండికోటలో ఇంటర్ విద్యార్థినీ వైష్ణవి హత్య కేసు వరకూ.. పరిశీలిస్తే.. చేతిలో కాసులుంటే చాలు చట్టాన్ని తిమ్మిని బమ్మి చేయవచ్చనే అంశం కనిపిస్తుంది. ఈ మూడు కేసుల్లోనూ ఆధారాలు (No Evidence) అదృశ్యమయ్యాయి. నిజం మూగబోయింది. అందుకే అసలు దోషులు తప్పించుకున్నారు.

ఇటు ప్రత్యూష తల్లి సరోజినీ దేవీ కన్నీటి వ్యథ. అటు ఆయేషామీరా అమ్మ షంషాద్ బేగం గుండె కోత. ఇద్దరూ ఉపాధ్యాయులే. తమ విధి నిర్వహణలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దిన అమ్మవార్ల. చట్టాన్ని నమ్మారు. ఒకరు 24 ఏళ్లు.. మరొకరు 19 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వీరిని న్యాయదేవత కరుణించటం లేదు. ఇందుకు సాక్షాలు కనపడటవం లేదు. నిజం మూగబోయింది. అందుకే ఈ కేసుల్లో అసలు దోషులు అమాయకులయ్యారు, అని జనం వాదిస్తున్నారు.
No Evidence : ప్రత్యూష తల్లి వాదనేంటీ.
నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఆమె తల్లి సరోజినీ దేవి అసంతృప్తిని వ్యక్తం చేశారు . ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని సరోజిని దేవీ మొదటి నుంచీ వాదిస్తున్నారు. తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి, విషం ఇచ్చి చంపేశారని ఆమె ఆరోపించారు. డాక్టర్ మునిస్వామి ఇచ్చిన తొలి పోస్టుమార్టం నివేదికలో మెడపై ఒత్తిడి (స్ట్రాంగ్యులేషన్) వల్ల మరణం సంభవించిందని, అత్యాచారం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు.

కోర్టులు ఆ నివేదికను కాకుండా, త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టునే పరిగణనలోకి తీసుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యూష మరణించిన సమయంలో ఆమె ధరించిన దుస్తులు అడిగితే అవి కాలిపోయాయని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. , మెడపై ఉన్న గుర్తులను క్లిప్పుల వల్ల వచ్చినవిగా బుకాయించారు. ఇలా సాక్ష్యాలను తారుమారు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడుతుందని ఆశించానని, కానీ కేవలం రెండేళ్ల శిక్షను ఖరారు చేయడం ద్వారా తనకు పూర్తి న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
No Evidence : ఆయేషా మీరా తల్లి గుండె ఘోష

సీబీఐ కోర్టుకు సమర్పించిన దర్యాప్తు నివేదికపై ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం ఇక్బాల్ బాషా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు (ఫిబ్రవరి 18, 2026) విజయవాడలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని, ఈ కేసును సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జడ్జిని కోరారు.ఈ కేసును మీరే స్వయంగా ప్రైవేటుగా విచారణ జరిపించుకుంటారా (Private Prosecution) అని న్యాయమూర్తి ప్రశ్నించగా, తమ దగ్గర అంత డబ్బు లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.

గతంలోనే నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై మళ్లీ అభియోగాలు మోపడంపై అభ్యంతరం తెలిపారు. రాజకీయ పలుకుబడి ఉన్న అసలు నిందితులను వదిలేసి, కేసును నీరుగారుస్తున్నారని గతంలోనే ఆయేషా మీరా తల్లిదండ్రులు పేర్కొన్నారు. . గత 19 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని, ముఖ్యమంత్రి , ప్రభుత్వం జోక్యం చేసుకుని నిజమైన హంతకులను శిక్షించాలని ఆమె ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు.
No Evidence : వీడని గండి కోట రహస్యం

ఇంటర్ విద్యార్థిని దిన వైష్ణవి(18) హత్య జరిగి 8 మాసాలు గడచినా కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.గత జూలై 14న వైష్ణవి కాలేజ్ కి వెళుతున్నానని చెప్పి ప్రియుడు లోకేష్ తో గండికోటకు వెళ్ళింది .గండికోటకు వెళ్లిన వైష్ణవి మరుసటి రోజు 15న కనిపించింది. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విధితమే. గండికోటలో జరిగిన వైష్ణవి హత్య కేసును జమ్మలమడుగు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన మరుసటి రోజే 16న కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ గండికోట ను సందర్శించారు. వైష్ణవి హత్య గురించి తెలుసుకున్నారు. వైష్టవిపై అత్యాచారం జరగలేదని, అసలు నిందితులెవరో అదేరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని డీఐజీ చెప్పారు.

కానీ డీఐజీ వెళ్ళిపోయారు. హత్య కేసులో నిందితులు ఎవరో ఇంతవరకు ప్రకటించకపోవడం వెనక ఉన్న కారణాలు ఏమిటని ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు . వేటికి కూడా పోలీసులు స్పందించడం లేదు .కనీసం పోస్టుమార్టం నివేదిక కూడా ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు. గండికోట హత్య కేసును మిస్టరీగానే మార్చాలనే ప్రయత్నం చేస్తున్నార అనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి ఈ కేసును పోలీసులు ఎందుకు చేదించలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హంతకులు ఎవరు? ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారు ..! హత్య చేయాల్సిన కారణాలు ఏమిటి వాళ్ళు ఎవరు అని గుర్తించడంలో జమ్మలమడుగు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. గత నెల 26న లైవ్ డిటెక్టర్ పరీక్షకు పోలీసులు జమ్మలమడుగు కోర్టులో పిటిషన్ వేశారు. అనుమానం ఉన్న వైష్ణవి సోదరులు రెడ్డయ్య, సురేంద్ర, ప్రియుడు లోకేష్ లను కోర్టులో గుట్టు చప్పుడు కాకుండా హాజరు పరిచారు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు వాళ్ళు అంగీకారం తెలిపినట్లు పత్రికల్లో వచ్చింది తప్ప అధికారికంగా ఈ విషయం పోలీసులు ఇంతవరకు పత్రికలకు ఎందుకు ప్రకటించలేదు.
No Evidence : పొలిటికల్ పవర్ తోనే…
ఈ మూడు కేసుల్లోనూ పొలిటికల్ పవర్ తోనే ఆధారాల మాయం కథనం వినిపిస్తోంది. ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డి తండ్రి గుడిపల్లి రాఘవరెడ్డి అప్పట్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ రాజకీయ బంలంతోనే పోలీసు దర్యాప్తులో సాక్ష్యాలు తారుమారయ్యాయని బాధితురాలు సరోజినీదేవీ ఆరోనిస్తున్నారు. నిజానికి సరోజినీ దేవికి ఉన్న ఒక్కగానొక్క ఆధారం ప్రత్యూష మృతదేహం. కుటుంబ సంప్రదాయం ప్రకారం ప్రత్యూష కు దహన సంస్కారం జరిపారు. సీబీఐ కూడా తమకు ఆధారాలు లభించక పోవటంతోనే ఈ కేసును ఆత్మహత్యగానే దృవీకరించారు.

ప్రేమ పేరుతో.. పెళ్లి జరగదని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించింది ఎవరు? ప్రత్యూష కాదు. తాను నటిగా ఉజ్వల భవిష్యత్తుపై గంపెడాశలతో ఉంది. ఈ ప్రతిపాదన ఆమె తీసుకురాలేదు. బ్యూటీ పార్లల్ లో ఉన్న ప్రత్యూష దగ్గరకు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. 15 నిముషాలు మాట్లాడటానికి వెళ్లిన ప్రత్యూష.. ఆత్మహత్యకు ఎందుకు అంగీకరించింది. ఆమెకు ఎక్కువ మోతాదులో పురుగు మందు ఇవ్వటం వల్లనే ఆమె చనిపోయింది. అంతే సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్య గేమ్ కు పక్కాప్లాన్ అమలు చేశాడు. అంటే.. ఇది ఆత్మహత్య పేరిట.. జరిపిన హత్యే.. అని సీబీఐ అధికారులు.. కోర్టు ఎందుకు భావించలేదు. సీబీఐ అందించిన ఆధారాలతో దిగువ కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధిస్తే.. హైకోర్టు రెండేళ్లకే ఎందుకు పరిమితం చేసింది. అంటే.. సీబీఐ సమర్పించిన ఆధారాలు కూడా బలహీనమేనా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

ఇక ఆయేషా మీరా కేసు దర్యాప్తులోనూ పొలిటికల్ పవర్ పని చేసింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రసన్నం చేసుకోవటానికే పోలీసు ఉన్నతాధికారులు తంటాలు పడినట్టు ఆరోపణలుఉన్నాయి. ఆయేషా మీరా కేసులో ఆధారాలను మాయం చేసిందీ పోలీసులే. సత్యం బాబును అరెస్టు చేసిందీ పోలీసులే. అసలు నిందితులకు అండగా నిలిచిందీ పోలీసులే.. అని జనం ఇప్పటికీ వాదిస్తున్నారు. కానీ కోర్టులో నిజం చెప్పే సాక్షులే లేరు. అందుకే న్యాయదేవత కూడా బాధితుల వైపు కళ్లప్పగించి చూస్తోందని జనం వాపోతున్నారు.
also read : Self Punishment : ఇదొక స్వీయ శిక్ష స్వీయ శిక్ష Andhra Prabha TOP Story
