2.50 Cr | కటీఫ్ చెప్పనున్న తెలంగాణ

2.50 Cr | కటీఫ్ చెప్పనున్న తెలంగాణ
వరి సాగు తగ్గించాలని కేంద్రం పిలుపు
అన్ని రాష్ట్రాలకు సూచించిన మోదీ సర్కార్
ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా దిగుబడి
కనీసం బస్తా పెట్టేందుకు ఖాళీ లేని ఎఫ్సీఐ గిడ్డంగులు
వాణిజ్య పంటల వైపు మళ్లాలని రైతులకు హితవు
వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్
ఏటా ఐదు లక్షల ఎకరాలను తగ్గించేలా టార్గెట్
వేగంగా అడగులు వేస్తున్న రేవంత్ సర్కార్
వాణిజ్య పంటలు వేస్తే ఎకరాకు ₹10 వేల ప్రోత్సాహం
ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా చర్యలు
2.50 Cr | హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వరి ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోతుండటం, ఇతర నిత్యావసర పంటల ఉత్పత్తి తగ్గుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించాలని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్ల కాలంలో మొత్తం 2.50 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రతి ఏటా 50 లక్షల ఎకరాల వరి సాగును తగ్గించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున, ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఎకరాల మేర వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ విధించింది. జాతీయ స్థాయిలో కేంద్రం నిర్దేశించిన మొత్తం లక్ష్యంలో ఒక్క తెలంగాణ వాటానే దాదాపు 10 శాతంగా ఉండటం గమనార్హం.

2.50 Cr | వరిసాగులో తెలంగాణ టాప్..
దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ఏళ్లుగా వరి సాగు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణలో 2023-24లో 118 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు.. 2024-25 నాటికి 127 లక్షల ఎకరాలకు చేరింది. ప్రస్తుతం 132 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని అంచనా. ఈ భారీ ఉత్పత్తి కారణంగా ఎఫ్సీఐ గిడ్డంగుల్లో నిల్వలకు స్థలం దొరకడం లేదు. కాగా, దేశంలో వరి పంట విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పామాయిల్ సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోతోంది. ఫలితంగా ఏటా ₹1.50 లక్షల కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఈ వ్యయాన్ని తగ్గించి దేశీయంగా స్వయంసమృద్ధి సాధించాలంటే పంట మార్పిడి అనివార్యమని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో రెండో సీజన్ (యాసంగి/రబీ)లో వరి సాగు కేవలం 30 శాతం లోపే ఉంటుంది. కానీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు సీజన్లలోనూ వరిని విస్తారంగా పండిస్తున్నారు. దీనివల్ల నిల్వలతో పాటు నీటి లభ్యత సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

2.50 Cr | వాణిజ్య పంటలు వేస్తే… రూ.10 వేలు ప్రొత్సహకం.
కేంద్ర సూచనలతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరి సాగును తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పంట మార్పిడిపై దృష్టి పెడుతున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రైతు కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు.. వరి సాగు మానేసి ఇతర వాణిజ్య, పప్పుధాన్యాల పంటలు వేసే రైతులకు ఎకరాకు ₹10వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) అందించే సరికొత్త పాలసీని తీసుకురావడానికి రేవంత్ సర్కార్ యోచిస్తోంది. దీనివల్ల రైతులకు నష్టం కలగకుండా ఇతర లాభదాయకమైన పంటల వైపు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
CLICK HERE TO READ MORE : 8th Day | కర్పూర కాంతుల్లో దివ్యక్షేత్రంలో వెలుగులు
