పీజీఆర్‌ఎస్ రద్దు.. కలెక్టర్ ప్రకటన

ప్రత్యేక ఎన్నికల విధుల నేపథ్యంలో నిర్ణయం.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి కలెక్టరేట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది అందరూ ఎన్నికల ప్రత్యేక విధుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంటారని తెలిపారు. ఈ కారణంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ఈ సోమవారం నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.