- ఈ నెల ఏడో తేదిన ఆపరేషన్ సిందూర్ స్టార్ట్
- పాక్ లో ని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి
- ఈ దాడులలో మొత్తం 100 మంది ఉగ్రవాదులు హతం
- ఇందులో జైషే-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా కీలక కమాండర్లు
- హతుల వివరాలను వెల్లడించిన భారత ఆర్మీ అధికారులు
న్యూ ఢిల్లీ – ఇండియన్ ఆర్మీ ఇటీవల హతమార్చిన ఉగ్రవాదుల పేర్లు బహిర్గతం అయ్యాయి. పాకిస్తాన్, పీవోకేలోని మొత్తం 9 టెర్రరిస్టు క్యాంపులపై ఈనెల 7న ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత వైమానిక దళం దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొత్తం వందకు పైగా టెర్రరిస్టులు హతమయ్యారు . వారిలో టాప్ కమాండర్స్ ఉన్న అయిదుగురు వివరాలను భారత ఆర్మీ వెల్లడించింది.. జైషే-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి.
ఆ ఐదుగురు కీలక ఉగ్రవాదులు:
- ముదస్సర్ ఖాడియన్ ఖాస్
- హఫీజ్ ముహమ్మద్ జమీల్
- మహ్మద్ యూసుఫ్ అజార్
- ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా
- మొహమ్మద్ హసన్ ఖాన్
1) ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ : ఇతనికి లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. అతని అంత్యక్రియల ప్రార్థన ప్రభుత్వ పాఠశాలలో జరిగింది, దీనికి గ్లోబల్ టెర్రరిస్ట్ కు చెందిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ హాజరయ్యారు. పాక్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజి గా పనిచేస్తున్న ఆయన ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
2) హఫీజ్ ముహమ్మద్ జమీల్ : ఇతనికి జైషే మొహమ్మద్తో అనుబంధం ఉంది. ఇతను మౌలానా మసూద్ అజార్ కు పెద్ద బావ.
3) మొహమ్మద్ యూసుఫ్ అజార్ : ఇతనికి జైషే మొహమ్మద్తో అనుబంధం ఉంది. ఇతను మౌలానా మసూద్ అజార్ కు బావ. ఇతను కాందాహర్ కు వెళుతున్న భారత్ విమానం IC-814 హైజాకింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.
4) ఖలీద్ : లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. ఇతను జమ్మూ & కశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణాలో సిద్దహస్తుడిగా పేరుంది. అతని అంత్యక్రియలు ఫైసలాబాద్లో జరిగాయి. పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
5) మొహమ్మద్ హసన్ ఖాన్: జైష్-ఎ-మొహమ్మద్తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇతను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో JeM ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూ & కశ్మీర్లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు.