త్రివిధ దళాధిపతులు, సీడీఎస్, రక్షణ మంత్రి హాజరు
విడిగా ప్రధానితో అజిత్ దోవల్ భేటీ
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై సమీక్ష
బలగాల సన్నద్దతపై సిడిఎస్ వివరణ
సామాన్య ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా వెళ్లాలని ప్రధాని సూచన
న్యూ ఢిల్లీ – భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు భారత్ కు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు అధికారులు.. మన గగనతల వ్యవస్థ పటిష్టంగా ఉండటం , సుదూర లక్ష్యాలను చేదించే మిస్సైల్స్ వినియోగంలో రావడంతో మన డిఫెన్స్ పటిష్టంగా ఉందన్నారు. ఇదే సమయంలో ఈ నెల ఏడో తేదిన ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై నిర్వహించిన దాడులలో మరణించిన ఉగ్రవాదుల జాబితాను మోడీ ముందు ఉంచారు..
ముగ్గురు జైషే, ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ఉన్నారని వివరించారు. కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు చెప్పారు. చనిపోయినవారిలో జైషే హెడ్ మసూద్ అజార్ బంధువులతో పాటు ముంబై 26/11 దాడుల నిందితుడు, కాందహార్ విమాన హైజాక్ ప్రధాన మాస్టర్ మైండ్ ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.. ఈ సందర్బంగా సివిలియన్స్ ఎటువంటి హాని లేకుండా దూసుకువెళ్లాలని త్రివిద దళాల అధిపతులకు సూచించారు..
కాగా, ఈ ఉన్నతస్థాయి సమావేశానికి కొన్ని గంటల ముందే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, భారత్ జరుపుతున్న దాడుల వివరాలను ప్రధానికి అందించారు..