- ప్రజల కోసం నా స్వంత నిధులు వెచ్చించా..
- అందుకే కుట్టుమిషన్ లకు పసుపు రంగు వేశా
- మీలా ప్రభుత్వ సొమ్ముతో మీ పార్టీ రంగు వేయలేదు
- మీలా పార్టీ రంగుల యావ మాకు లేదు
- నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం
- జగన్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్
వెలగపూడి : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలను గాలికి వదిలేసి, ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా కూడా లేని సమయంలోనే, మంగళగిరి నియోజకవర్గ ప్రజల పట్ల తన బాధ్యతను గుర్తించి, వారి స్వయం ఉపాధికి చేయూతనందించేందుకు వ్యక్తిగత నిధులను వెచ్చించానని లోకేశ్ తెలిపారు. కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో కుట్టు మిషన్లు కొని వాటికి పసుపు రంగు వేసి అందిస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ ఘాటుగా స్పందించారు.
“జగన్ గారూ మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేని కూడా కాను. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను.
కుల, మత అంతరాలు పాటించకుండా… తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాది మందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేశాను. మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022 జూన్20 ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్పటివరకూ 43బ్యాచ్ లలో 2226 మంది శిక్షణ పూర్తిచేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశాం.
తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచ్ లలో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచ్ లలో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసి, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం. ఇవన్నీ నా జేబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే… శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం” అంటూ లోకేశ్ అన్నారు.