పోలీసుల అదుపులో నిందితుడి మృతి

సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేటలో వృద్ధురాలు ఇరుగు పాపమ్మ హత్య, చోరీ కేసులో నిందితుడిగా గుర్తించిన సైదాచారి పోలీసుల అదుపులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు సందేహాలకు తావిస్తోంది.

మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సైదాచారి వృద్ధురాలితో పరిచయం ఏర్పరచుకుని మూడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని మిర్యాలగూడలోని మణప్పురం గోల్డ్ లోన్‌లో కుదువ పెట్టి ఏలూరుకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని సూర్యాపేటకు తరలిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఏలూరు నుంచి తరలిస్తుండగా కోదాడ సమీపంలో సైదాచారి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అర్ధరాత్రి సుమారు 1:15 గంటలకు అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

అయితే, ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడం, శవపరీక్ష గదిని పోలీసులు నియంత్రణలో ఉంచి మీడియాను అనుమతించకపోవడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.