Stumps INDvsAFG | టెస్టా.. లేక బ్యాటింగ్ ప్రాక్టీసా?

Stumps INDvsAFG | టెస్టా.. లేక బ్యాటింగ్ ప్రాక్టీసా?

  • ఆఫ్ఘాన్ బౌలర్లను ఉతికారేసిన టీమిండియా
  • ఆఫ్ఘాన్‌కు తొలి రోజే షాక్
  • న్యూచండీగఢ్‌లో టీమిండియా జోరు
  • 368/3తో ముగిసిన తొలి రోజు
  • భారీ స్కోరు దిశగా భారత్

న్యూచండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టులో తొలి రోజు పూర్తిగా టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) అద్భుత శతకంతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103*) మరో క్లాస్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఆఫ్ఘన్ బౌలర్లను ఓపికగా ఎదుర్కొంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు బాదేశారు. మొదట యశస్వి జైస్వాల్ (24) త్వరగా ఔటైనా.. ఆ తర్వాత రాహుల్, సాయి సుదర్శన్ కలిసి రెండో వికెట్‌కు 139 పరుగులు జోడించి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న సాయి సుదర్శన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఔటై నిరాశపరిచినా.. మరోసారి తన టెస్టు సామర్థ్యాన్ని చాటాడు.

సాయి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్… ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ముందుగా రాహుల్‌తో కలిసి రెండో వికెట్ కు 67 పరుగులు జోడించిన గిల్.. రాహుల్ ఔటైన తర్వాత రిషభ్ పంత్‌తో కలిసి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా పంత్ తనదైన దూకుడుతో ఆడుతూ 70 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం పంత్ 50, గిల్ 103 పరుగులతో అజేయంగా ఉన్నారు.

నాలుగో వికెట్‌కు గిల్-పంత్ జోడీ ఇప్పటికే 121 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో రెండో రోజు భారత్ 500+ స్కోరు వైపు దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ రెండు వికెట్లు పడగొట్టగా, జియౌర్ రహ్మాన్ షరీఫీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే భారత బ్యాటర్ల ధాటికి మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Leave a Reply