జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. నిజానికి బుధవారం రాత్రి 10.35 నిమిషాలకే గురువు మిథునరాశిలోకి ప్రవేశించాడు. అయితే గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి..
తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ పుష్కరాల 12 రోజులు ప్రతి రోజూ లక్ష మందికి పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు.. ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణీ సంగమం లో ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం. ప్రాణహితకి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరగ్గా, ఈసారి సరస్వతి నదికి, 2027లో గోదావరి పుష్కరాలు ఇలా మూడుసార్లు పుష్కరాలు జరగనుండటం విశేషం.
పుష్కర ఘాట్లు – ఏర్పాట్లు
పుష్కర ఘాట్లని సర్వాంగం సుందరంగా తీర్చిదిద్దారు. జ్ఞాన సరస్వతిఘాట్ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. కోటి రూపాయలతో తమిళనాడులోని మహబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షమందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు తీరంచెంత . యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్లో సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 గంటల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. రోజూ రాత్రివేళ ప్రవచన కర్తల ప్రవచనాలు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
నేటి సాయంత్రం రేవంత్ పుష్కరస్నానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది గురువారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కర ఉత్సవాలకు బయల్దేరుతారు. సాయంత్రం 5.20కి పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.40 కి ను సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం చేసుకుంటారు. 7.30 పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటలకు కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా తిరుగుపయనమవుతారు.