భూపాలపల్లి, ఆంధ్రప్రభ : కాళేశ్వరం త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంది. సోమవారంతో పుష్కర స్నానాలు ముగియనున్నాయి. ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఆదివారం నలుమూల నుంచి భక్తులు రాక తెల్లవారు జాము నుంచే ప్రారంభమైంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనులు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వాహనాలు వేసుకుని రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 15 కిలో మీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి.
ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.అధికారికంగా ఇదే తొలిసారి కావడంతో…శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్నా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు చేయడం ఇదే తొలిసారి.
ఉత్తరాది ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాలు కోసం దేశం నలుమూలల భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజు రోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి రోజు వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం జనమయం అవుతోంది. నది తీరంలో సందడిసరస్వతి నదిలో ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాలు చేస్తున్నారు.
అలాగే స్నానం అనంతరం త్రివేణి సంగమానికి చీరె సారె సమర్పిస్తున్నారు. సైకత లింగాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు. పిండ ప్రదానం, పెద్దలకు తర్పణాలు ఇవ్వడంతో వివిధ సంప్రదాయం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పురోహితులు, వేదపండితులు ఈ తంతును నిర్వహిస్తున్నారు. దీంతో ఒక వైపు తర్పణాలు ఇవ్వడానికి భక్తులు, పిండ ప్రదానం చేయడానికి పురుషులు, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పురోహితులు, అర్చకులు ఇలా నదీ తీరంలో సందడి నెలకొంటోంది.

అలాగే పూజ సామగ్రి అమ్మకాలు, పిండ ప్రదాన సామాగ్రి అమ్మకాలతో వ్యాపారులు బిజీగా ఉన్నారు. కన్నుల పండువగా నవరత్న హారతిసరస్వతి పుష్కరాల నేపథ్యంలో భక్తులను ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది నవరత్న హారతి. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ హారతి నిలుస్తోంది.త్రివేణి సంగమంలో నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతిని నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను రప్పించారు. కాశీ పూజారులు పుష్కరాలు ప్రారంభం రోజు రాత్రి నుండి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండటంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన ఏర్పాట్లు చేశారు. రోజూ రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతిని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి ప్రాధాన్యం ఏమటో భక్తులకు అర్థమవుతుంది.
11వ రోజుకు చేరిన పుష్కరాలుసరస్వతి నదీ పుష్కరాలు ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. తెల్లవారుజామున నుండే భక్తుల రద్దీ పెరిగి, పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం చేరుకుంటూ పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమం నదీతీరంలో పవిత్ర పుణ్య స్నానాలు చేసి, భక్తులు స్వామి వారి దర్శనానికి దేవాలయానికి చేరుకుంటున్నారు. స్నానానంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు.
15 కిమీల మేర నిలిచిన వాహనాలు
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు తండోపాతండాలుగా భక్తులు వస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో మహాదేవపూర్- కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ను వన్-వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది.
భక్తులు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్ పనిచేయకసరస్వతీ పుష్కరాలకు వెళ్లడానికి వాహనదారులు గూగుల్ మ్యాప్ వాడుతున్నారు. అయితే సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అటవీ ప్రాంతం కావడంతో గూగుల్ మ్యాప్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. దీనిపై ఆధారపడిన వాహనదారులకు రూట్ తెలియక ఇబ్బందులు పడుతున్నారు..
అన్నారం, సిరొంచ రూట్లలో ట్రాఫిక్ జామ్
కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లే వాహనాలు భారీగా వస్తుండడంతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్నారం క్రాస్ నుండి మద్దులపల్లి మీదుగా వెళ్లే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ప్రయాణికులు గంటలు తరబడి వేచి ఉన్నారు. వన్ వే రూట్ ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు సరైన ప్రణాళిక అమలు చేయక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా మంచిర్యాల చెన్నూరు వైపు నుండి వచ్చే వాహనాలు అంతర్రాష్ట్ర వంతన వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా సిరోంచ అంతరాష్ట్రవంతెన పై ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.