PoK | కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్..
PoK | కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్..
ఆంధ్రప్రభ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన MI-17 హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సైనిక సిబ్బంది అంతా మృతి చెందినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. బుధవారం ముజఫరాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే హెలికాప్టర్లో మొత్తం ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం..
హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా పొగలు ఎగసిపడినట్టు స్థానికులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు, అంబులెన్సులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగానే కూలిపోయినట్లు పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. “ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ, రికవరీ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు బోర్డ్ ఆఫ్ ఇన్క్వైరీ ఏర్పాటు చేశాం” అని సైన్యం తెలిపింది.
సంతాపం తెలిపిన పాక్ నాయకులు…
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హెలికాప్టర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
