ACB Raids | ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు..
ACB Raids | ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు..
11 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు
ACB Raids | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్కు చెందిన నివాసాలు, ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఇవాళ విస్తృత సోదాలు నిర్వహించారు.
మాదాపూర్లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ ప్రత్యేక బృందాలు ఇవాళ ఉదయం నుంచే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో పత్రాలు, ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నాయి. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోదాల్లో వెలుగులోకి వచ్చే అంశాలపై ఆసక్తి నెలకొంది.


