Tirumala: అలిపిరిలో మళ్లీ కనిపించిన చిరుత

తిరుమల: తిరుమలలోని అలిపిరిలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాలో వీడియో చూసి టీటీడీ భక్తులతో పాటు దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నడక మార్గంలోకి వచ్చి పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి చిరుత తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

దృశ్యాలను చూసి షాక్‌కు గురైన దుకాణదారులు వెంటనే ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్‌అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే రంగంలో దిగారు. నడక మార్గంలో భక్తులకు అలెర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం అనంతరం గుంపులు గుంపులుగా వెళ్ళాలని టీటీడీ సూచించింది. ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు టీటీడీ అదికారులు.

ఇటీవల కాలంలో తిరుమల జనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఎక్కువగా వినిపియటంతో.. భక్తులు ఆందోళనకు గురైతున్నారు. అంతేకాదు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ ప్రజలంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వారంరోజుల కిందట తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత కలకలం రేపిన విషయం తెలిసింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల దగ్గర చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. టీటీడీ అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *