Indigo | శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం

Indigo | శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం
Indigo | శంషాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి ఇవాళ రాయపూర్ కు ఇండిగో విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, టెకాఫ్ అయ్యే ముందే పైలెట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో విమానంలో ఉన్న 71 మంది ప్రయాణికులను కిందకు దించేశారు అధికారులు. ఆపై ఎయిర్పోర్టు సిబ్బంది.. విమానంలో సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు.
కానీ, ఎంతసేపటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు 71 మంది ప్రయాణికులను మరో విమానంలో రాయపూర్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సమస్య ఎక్కడ ఉంది?.. ఎందువల్ల సాంకేతిక లోపం తలెత్తింది? అనేదానిపై ఇండిగో సిబ్బంది అధికారికంగా వెల్లడించలేదు. ఉదయం 6:45 గంటలకే రాయపూర్ కు వెళ్లాల్సి ఉండగా.. గంట గడిచినప్పటికీ ఇండిగో సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు ఎక్కువగా తలెత్తుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇండిగో యాజమాన్యం దృష్టిపెట్టాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

click here to read more : Fake notes | నకిలీ నోట్లు స్వాధీనం
