Earthquake | రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత..
నాగసాకి సమీపంలో భూకంప కేంద్రం
సునామీ హెచ్చరికలు
Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జపాన్లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని నాగసాకికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ఆశ్రయం పొందారు.
భూకంపం అనంతరం జపాన్ వాతావరణ శాఖ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు, నౌకలు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.
