హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును ధర్మాసనం ఇవాళ కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావలసిన నిధులను కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉట్నూరు పోలీసులు కేటీఆర్పై బీఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. కాగా, తాజాగా ఆ కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు ధర్మాసనం కేటీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఇవాళ తుది తీర్పును వెలువరిచింది.