అర్హులైన ప్రతి ఓటరును గుర్తించాలి

అర్హులైన ప్రతి ఓటరును గుర్తించాలి

ఎస్‌ఐఆర్ సర్వేను పరిశీలించిన సర్పంచ్

చిట్యాల, జూన్ 25 (ఆంధ్రప్రభ): సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను చిట్యాల మండలంలోని సుంకెనపల్లి గ్రామంలో సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య పరిశీలించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరును గుర్తించాలని బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సర్వే నిర్వహిస్తున్న ఓ ఇంటిని సందర్శించి బీఎల్‌వోను అడిగి సర్వే విధానం, నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ సర్వే విజయవంతం కావాలంటే గ్రామస్తులంతా పూర్తి స్థాయిలో సహకరించాలని సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య కోరారు. అనంతరం సర్పంచ్ కుటుంబ సభ్యులందరూ తమ ఓటరు జాబితా సవరణ దరఖాస్తు ఫారాలను బీఎల్‌వోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.