Enjoys Fish Curry : వావ్ చేపల పులుసు Andhra Prabha Top Story
Enjoys Fish Curry : వావ్ చేపల పులుసు Andhra Prabha Top Story
- ఆరగించిన ఏపీ సీఎం
- నేలపైనే సహపంక్తి భోజనం
- పల్లెకారు కుటుంబంతో.. మాటామంతీ
( ఆంధ్రప్రభ, కావలి)

Enjoys Fish Curry : నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబం ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. మార్కెట్లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి…స్థానిక మత్స్యకారుని ఇంటికి వెళ్లి వండించుకుని తిన్నారు. కుటుంబ సభ్యుడిలా వారితో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించారు.

కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్య్సకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నఅనంతరం స్థానిక చేపల మార్కెట్ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. అక్కడ ఉన్న మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు. మార్కెట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రికి మత్య్సకారుడు తానంగారి బాబు, ఆయన కుమారుడు గిరి స్వాగతం పలికారు. సీఎం తమ మార్కెట్కు రావడం పట్ల మత్స్యకారులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.

మత్స్యకారుడు తానంగారి బాబుతో మాట్లాడిన ముఖ్యమంత్రి… వారి జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్లో చేపల విక్రయాలపై అడిగి తెలుసుకున్నారు. ‘మత్య్సకారుల సేవలో’ పథకం ద్వారా ఏడాదికి అందుతోన్న రూ.20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని బాబు సీఎంకు వివరించారు. స్థానికంగా లభించే చేపల రకాల గురించి సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
Enjoys Fish Curry : మత్య్సకారుడి ఇంటిలో …

మార్కెట్లో సందర్శన అనంతరం స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం వారి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ లో కొనుగోలు చేసిన చేపలు తీసుకుని వెళ్లారు. తానంగారి బాబు సతీమణి వెంకమ్మ ముఖ్యమంత్రి తెచ్చిన చేపలను తమ ఇంట్లో వండారు. వెంకమ్మ చేపల పులుసు పెట్టే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడే ఉండి కూర వండే విధానాన్ని పరిశీలించారు. సరదాగా కొద్దిసేపు గరిటె తిప్పారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన వెంకమ్మ కుమార్తెతో మాట్లాడి తల్లీబిడ్డ బాగోగుల గురించి ఆరా తీశారు.

వెంకమ్మ చేపల కూర సిద్ధం చేయడంతో వారి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా తన చేతులతో వారికి చేపల పులుసును వడ్డించారు. అనంతరం వారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు. తమఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ : Target 2028 : ఆ సెల కల కాదు Andhra Prabha Spl Story
