who I Global Emergency I 1976 I ఆంక్షలు వద్దు.. అప్రమత్తంగా ఉండాలి!

గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
విజృంభిస్తున్న ఎబోలా వైరస్
కాంగోలో 88 మంది మృతి
ఆఫ్రికా దేశాల ప్రజల వణుకు
1976లో కాంగోలో తొలిసారి గుర్తించిన వైరస్
గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది
ఆంధ్రప్రభ వెబ్ (అంతర్జాతీయం) : ప్రపంచంలో మరో వైరస్ ముప్పు ముంచుకొస్తుంది.. ఆరేళ్ల కిందట కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతి ఇంకా ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు కొత్త వైరస్ ఎబోలా (Ebola) ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ వైరస్కు చికిత్సలు, వ్యాక్సిన్లు లేకపోవడంతో వైరస్ సోకిన తర్వాత అరికట్టం అసాధ్యమని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని, సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

విజృంభిస్తున్న వైరస్…
ఎబోలా వైరస్ తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300మంది ఈ వైరస్ బారిన పడినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. ఎబోలా వ్యాధిని 1976లో జైర్ (ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), సూడాన్ (ప్రస్తుతం దక్షిణ సూడాన్) లలో దాదాపు ఒకే సమయంలో సంభవించిన వ్యాప్తిలో గుర్తించారు. ఈ వైరస్ సోకిన 8-10 రోజుల తర్వాత ఎబోలా లక్షణాలు సర్వసాధారణంగా ప్రారంభమవుతాయి, కానీ వైరస్ సోకిన 2 నుండి 21 రోజుల మధ్య ఎప్పుడైనా లక్షణాలు కనిపించవచ్చు. జ్వరం, తలనొప్పి, కీళ్ల , కండరాల నొప్పి , విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం అసాధారణ రక్తస్రావం లక్షణాలు కనిపిస్తాయి.
ఆంక్షలు వద్దు…
ఎబోలా వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని.. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. వ్యాధి నిర్ధరణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి.. వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సలహా ఇచ్చింది.
ఇది జూనోటిక్ వైరల్ ఇన్ఫెక్షన్
గతంలో ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని పిలువబడిన ఎబోలా వైరస్ వ్యాధి (EVD), ఎబోలా వైరస్ వల్ల కలిగే ఒక అరుదైన ప్రాణాంతకమైన జూనోటిక్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా గబ్బిలాల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.

వైరస్ నుంచి బయటపడినవారికి…
ఎబోలా వైరస్ వ్యాధి నుండి బయటపడినవారు అనేక లక్షణాలతో బాధపడవచ్చు. వీటిని సమిష్టిగా “పోస్ట్-ఎబోలా వైరస్ వ్యాధి సిండ్రోమ్” (PEVDS) అని పిలుస్తారు. కీళ్లవాపు, వినికిడి లోపం, కడుపు నొప్పి, నాడీ-మానసిక రుగ్మతలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న అవయవాలలో వైరస్ నిలిచిపోవడంతో పాటు, కంటి సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ తర్వాత నుండి బయటపడినవారిలో 60% మంది కంటి సంబంధిత సమస్యలు ఉంటాయి. డిసెంబర్ 2024లో జరిగిన ఒక అధ్యయనం, సియెర్రా లియోన్కు చెందిన 112 మంది బాధితులను పరిశీలించగా కంటి సమస్యలు కనిపించాయి. బాధితులలో 21% మందిలో (23/112) యువైటిస్ కనిపించింది. ప్రభావితమైన కళ్ళలో 39% కళ్ళలో దృష్టి 20/400 (WHO అంధత్వ పరిమితి) కంటే అధ్వాన్నంగా ఉంది. శుక్లాలు (18%), కార్నియల్ మచ్చలు (9%), మరియు ఆప్టిక్ న్యూరోపతి (6%) ద్వితీయ సమస్యలుగా గుర్తించబడ్డాయి .

