డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు..అభివృద్ధికి దారిదీపాలు

డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు..అభివృద్ధికి దారిదీపాలు
మహనీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
డా.జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావులు అన్నారు.అంబేద్కర్ సమానత్వం,సామాజిక న్యాయం, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దేశ ప్రగతికి బలమైన పునాది అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సెంట్రల్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
మంగళవారం నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవం సందర్భంగా నగరంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో ముందడుగు వేస్తూ ప్రగతిపథ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డా. బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషిచేశారని, సమాజంలోని ప్రతిఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల ఫలాలు అందుకునేలా చేశారని శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యను సాధనంగా తీసుకుని వ్యక్తి మాత్రమే కాకుండా సమాజం మొత్తం అభివృద్ధి చెందాలన్న ఆయన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తోందని.. వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
