Chhattisgarh | భారీ ఎన్ కౌంటర్… నలుగురు నక్సలైట్లు మరణం
నారాయణపూర్ – చత్తీస్ గడ్ : వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఛత్తీస్గడ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా.. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా భారీ ఎత్తున వరుసగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు. గత ఐదు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్గఢ్లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భారీగా భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి వరుసగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. అగ్రనేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్లాల్ తెలిపారు.