ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ వేడుకలు!
ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ వేడుకలు!
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
