AP | 19న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాప‌న

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం – ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు.

చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన ఇందులో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్ఠాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి వెల్లడించారు. పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

Leave a Reply