AP Assembly | వైసీపీకే ఉపాధి హామీ – రూ.250 కోట్లు దుర్వినియోగం – ప‌వ‌న్ క‌ల్యాణ్

( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) – అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభ్రుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ పథకంలో జరిగిన అవినీతి అంతుతేల్చటమే తమ ప్రభుత్వం ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని.. అది గత ప్రభుత్వంలో జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపైనే అని ఆయన అసెంబ్లీకి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు.అయినా సరే సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఆయనను తప్పించినట్లు తెలిపారు. రాష్ట్ర స్ధాయి ప్లయింగ్ స్వ్కాడ్‌లతో మస్తర్ జాబితాలు సరిగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నామన్నారు.

అవినీతి వాస్తవం.. ఆధారాలే ల్లేవ్…

రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీలో జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. సాక్షాధారాలు లేక కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రూ. 75 లక్షలు రికవరీ చేశామని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 31 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పనులు చేయకుండానే చేసినట్లు రాసుకున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరిగినట్టు ఫిర్యాదు అందింది. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించినట్టు తేలిందన్నారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. 25 మండలాలకు గాను 16 మండలాల్లో అక్రమాలు జరిగాయి. వివిధ స్థాయిల వారి నుంచి దాదాపు 520 మందిని గుర్తించారు. అందులో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఉన్నట్లు తేలిందన్నారు. మిగతా వారిపై విచారణ జరుగుతోందన్నారు. ప్రస్తుతం 526 మండలాల్లో సోషల్ ఆడిట్ చేశామన్నారు. మరి కొన్నింటిని ఈనెల చివరి నాటికి పూర్తి కానుందన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని సభ్యులు చెబుతున్నారని, అక్కడా ఆధారాలు లభించలేదన్నారు.కొద్ది మొత్తంలో నిధులు రికవరీ చేశామన్నారు. కొత్త జిల్లాలు రేషియాను బట్టి పరిశీలిస్తామన్నారు. జంగిల్స్ క్లియరెన్స్ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతామని గుర్తు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశమైన విషయాన్ని గుర్తు చేశారు . జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ ఆదాయ మార్గమైంది

గత అయిదేళ్లుగా ఎన్ఆర్ఈజీఎస్‌ను వైసీపీ ఆదాయ మార్గంగా మార్చుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులు మరలా మరలా చూపించి… పని చేయని వారిని కూలీలుగా చూపించి డబ్బులు తీనేశారని ఆరోపించారు. ఆదోనిలో సాక్షి విలేఖరి బందువులను మస్తర్‌లో రాసి వారికి పనికి వెళ్లకపోయినా బిల్లు చెల్లించారని తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఇతర పార్టీల వారికి మస్తర్ ఇవ్వమని చెప్పారన్నారు. రాజకీయ ఉపాధి హమీ పథకమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకం కాదు అనేలా మార్చేశారన్నారు.
ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ.. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు సభ దృష్టికి తెచ్చారు. అలాగే జాబ్ కార్డు అవకతవకలు, సోషల్ ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసలైన పేద వారికి పనులు లభించడం లేదన్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్నారు. 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడినట్టు ప్రజలు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై శాఖపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ .. జిల్లాల విభజన సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయన్నారు. కొన్ని జిల్లాలకు ఎక్కువగా, మరికొన్నింటికి తక్కువగా హామీ పనులు రావడం మొదలైందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *