ఖరీఫ్‌కు ఎరువుల సరఫరా లోటు ఉండదు

ఖరీఫ్‌కు ఎరువుల సరఫరా లోటు ఉండదు

  • వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్ సూచించారు. సోమవారం రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ (RFCL) ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ…. తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ నుండి ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఆలస్యం లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రైతులకు సమయానికి ఎరువులు అందడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో సమన్వయం పాటించాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి ప్లాంట్‌ను సందర్శించి, యూరియా ఉత్పత్తి ప్రక్రియను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించారు. ఉత్పత్తి సామర్థ్యం, యంత్రాల పనితీరు, నిల్వలు వంటి అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్లాంట్ యూనిట్ హెడ్ జిందాల్, ప్రొడక్షన్ హెడ్ సహా, టెక్నికల్ సర్వీసెస్ హెడ్ డి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.