రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి 90రోజుల యాక్షన్ ప్లాన్..

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి 90రోజుల యాక్షన్ ప్లాన్..
క్రీడాకారుల భేటీలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్
తిరుపతి (రాయలసీమ) ఆంధ్రప్రభ ; రాష్ట్రంలో క్రీడా రంగ సమగ్ర అభివృద్ధి చేయడానికి సంబంధిత రంగ నిపుణుల సూచనలు, అభిప్రాయాల ఆధారంగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం తిరుపతిలో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించిన ఆయన అక్కడే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రెండేళ్లక్రితం 3,132 కి.మీల మేర చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా యువత ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నానన్నారు ఆ సందర్భంగా ఇచ్చిన రాయలసీమను స్పోర్ట్స్ హబ్ మొదలైన హామీలను త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఆ హామీల లో భాగంగానే అమలు లోకి తెచ్చిన స్పోర్ట్స్ కొత్త ద్వారా ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 421మందికి క్రీడాకారులకు ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేస్తూ స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రతిభను క్రీడారంగ అభివృద్ధికి ఉపయోగించుకుంటామన్నారు.

ఉమ్మడి ఆంధ్ర [ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లనే హైదరాబాద్ లో స్పోర్ట్ విలేజ్ ఏర్పాటైందని పేర్కొంటూ దాని ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని బాలలకు ఫిట్ నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబాటుకు ప్రధాన కారణంగా గుర్తించామన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ చర్యలతోపాటు తల్లిదండ్రుల సహకారం అవసరం అన్నారు. వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థీకృతంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మూడు చోట్ల గ్రోత్ కారిడార్లలో క్రీడాభివృద్ధి విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకారులకు ఉద్యోగాల భర్తీలో న్యాయం జరిగేలా పారదర్శకత పాటిస్తున్నామన్నారు. క్రీడాకారులు అభిప్రాయాలన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి, 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ బెస్ట్ మెకానిజం అమలు చేయనున్నట్టు తెలిపారు.

అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలియజేశారు. తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన క్రికెట్ మైదానం చాలా బాగుందని, దీని నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తమ ప్రతిభతో రాణిస్తోన్న జ్యోతి యర్రాజీ, శ్రీచరణి వంటి మహిళా క్రీడాకారిణులకు చేయూత నందిస్తామని తెలిపారు.
ఈ భేటీలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పివి సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్ బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), దండు పూజ (బ్యాడ్మింటన్), పి.శివారెడ్డి (ఖోఖో), ఇ. రజని (హాకీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్ రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.
