అయినా కాపాడేందుకు రెస్క్యూ చేస్తున్నాం
వాళ్లంతా ప్రాణాలతో ఉన్నారో, లేరో చెప్పలేం
ఆశలు వదులుకోవాలంటున్న మద్రాస్ ఐఐటీ బృందం
అక్కడి పరిస్థితిని చూస్తే వాళ్లు బతకడం కష్టమే
విద్యుత్ సరఫరా, ఆక్సిజన్ అందించేందుకు యత్నాలు
కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
ఎల్అండ్టీ ఆక్వా ఐ కెమెరాతో లోతైన అన్వేషణ
మరికొద్ది సేట్లోనే బయటకు రానున్న ఫొటోలు
రెస్క్యూ బృందాలకు బ్లూ ప్రింట్ అందించిన నిపుణులు
టన్నెల్లోకి వెళ్లిన 30 మందితో కూడిన ప్రత్యేక బృందం
ఘటనా స్థలిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ:
ఎస్ఎల్ బీసీ టన్నెల్ ఘటన ఏపీ, తెలంగాణ ప్రజలనే కాదు.. యావత్ భారతదేశాన్ని కలచివేసింది. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది గురించి జనం తల్లడిల్లిపోతున్నారు. వారందరూ బతికి బయటపడాలని.. ఆ కుటుంబాల కళ్లల్లో ఆనందం చూడాలని సభ్య సమాజం తపించిపోయింది. సరీగా ఇదే సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగంలో 17 రోజులు చిక్కుకున్న 41 మంది కార్మికుల ప్రాణాలను నిలబెట్టిన సహాయక బృందాల నైపుణ్యం.. శ్రమ.. అంతకుమించి అంకిత భావాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. కాగా, మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దుర్ఘటన ప్రస్తుతం జనం గుండెల్ని పిండేస్తోంది. ఇక్కడ బురద అతి ప్రమాదకరంగా మారింది. గట్టి నేల ఉంటే వారు కష్టంగా అయినా బతికి బయటపడేవారని, కానీ, పెద్ద ఎత్తున బురదమట్టి నిండిపోవడంతో ఎనిమిది మంది బతకడం కష్టమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మద్రాస్ ఎన్ఐటీ నిపుణుల బృందం అయితే.. ఆశలు వదిలేసుకోవాల్సిందేనని చెబుతోంది. ఇంకా మృతదేహాలను కడసారి చూడటానికి కనీసం నెలరోజులు పడుతుందని అంటున్నారు. ఈ టన్నెల్ ఆపరేషన్ కాస్త డెడ్ బాడీస్ని తీసుకురావడానికేనా అని అందరూ మౌనంగా కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడింది. అప్పటి ఆపరేషన్ జిందగీ ఆనంద భాష్పాలు కురిపిస్తే.. ఇప్పటి ఆపరేషన్ డెడ్ బాడీస్ కథతో చివరి ఘట్టం కన్నీటి వరదను సృష్టించేలా మారింది.
బురద మట్టి, నీటిని తోడాలంటే కష్టమే..
ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో బురదలో చిక్కిన ఎనిమిది మంది మృతి చెందినట్టు సహాయ రక్షణ బృందాలు ప్రకటించాయి.. మృతదేహాల వెలికితీతకు కనీసం నెలరోజులు పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ దళాలు స్పష్టం చేశాయి. సొరంగంలో ఈ ఎనిమిది మంది చిక్కుకుని 48 గంటలు గడిచాయి. పైగా నిలువెత్తు బురద ఆక్రమించింది. ఈ స్థితిలో ఆక్సిజన్ అందకుండా ప్రాణాలతోఉంటారని భావించలేం అని వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ను పూర్తిగా కట్ చేయాలి. అంటున్నారు. శిథిలాలను తొలగించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. అప్పుడుగాని ఆ మృతదేహాలను బయటకు తీసుకురాలేమని ఎన్డీఆర్ఎఫ్ దళ సభ్యులు చెబుతున్నారు.
కొండరాళ్లతో మూసుకుపోయిన సొరంగం..
సోమవారం ఉదయం మద్రాస్ ఐఐటి నుంచి వచ్చిన నిపుణుల బృందంతో లోపలకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో 14వ కిలో మీటర్ నుంచి 11వ కిలో మీటరు వరకు అంటే మూడు కిలోమీటర్లలో మొత్తం నీరు, బురద కొండ రాళ్లతో మూసుకు పోయిందని గుర్తించారు.. మూడు కిలోమీటర్ల పడిన కొండరాళ్లతో కూడిన బురదను, నీటిని తొడాలంటే కష్టసాధ్యమైన విషయమని మద్రాస్ ఐఐటీ నిపుణులు తెలిపారు. ఇక టన్నె ల్ లో 14 కిలో మీటర్ల ప్రాంతంలో దాదాపు 500 మీటర్ల వరకు మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయిందని తెలిపారు. ఇదే ఇప్పుడు సహాయ చర్యలసై తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది.
నడుములోతు నీళ్లు, బురద..
సాధారణంగా సారంగంలోకి వెళ్లేందుకు, కార్మికులను, యంత్ర పరికరాలను తరలించేందుకు రైల్వే ట్రాక్ ను ఏర్పాటు చేశారు.. దీంతో వేరే భారీ యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం లేదు. కూలిన శిథి లాలను తరలించాలంటే ప్రస్తుతం ఏకైక మార్గం రైల్వేట్రాక్. ఆ మార్గంలోనే శిథి లాలను బయటకు తీసుకురావాలి. ట్రాక్ కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిందని అన్నారు. నడుము లోతు వరకు నీరు, బురద పేరుకు పోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటును కూడా పునరద్ధరించలేని పరిస్థితి అని చెప్పారు. సహాయ కార్యక్రమాలు నిపుణుల సలహాతో కొనసాగిస్తామని తెలిపారు.
రంగంలో ఆక్వా ఐ కెమెరా..
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో బురద సమాధిలో చిక్కిన మృతదేహాలను గుర్తించేందుకు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించాలని సహాయక బృందాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించింది. ఆక్వా ఐ కెమెరాతో ఎనిమిది మందిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ సంస్థ తమ ఆక్వా ఐ కెమెరాను దోమకుంటకు పంపించింది. ఈ కెమెరాలో 50 అడుగుల లోతులోని లక్ష్యాలను గుర్తించే సాంకేతికత ఉంది. ఈ స్థితిలో సోరంగంలో మూడు కిలోమీటర్లలో పేరుకుపోయిన బురద, ఇతర శిథిలాల్లో అడుగున చిక్కిన మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిది మంది మరణ వార్త ప్రపంచానికి తెలియనుంది.
వేగంగా గాలింపు చర్యలు..
దుర్ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోగా.. సహాయ బృందాల అన్వేషణ శరవేగంగా సాగుతోంది. సహాయక చర్యలను రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సాగర్ ఎమ్మెల్యే జై వీర రెడ్డి ఉన్నారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ బీ బాలకృష్ణ, ఎస్పీ గైక్వాడ్ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సహాయ బృందాలు దశలవారీగా పని చేస్తున్నారు. ఇప్పటికే టీబీఎం ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి 100 మీటర్లు దూరం వెళ్లారు. కానీ అక్కడ బురదతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది.