వందేమాత‌రం స్వాతంత్ర్య‌ ఉద్యమానికి ప్రేరణ

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

ఒంగోలు క్రైమ్, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్త‌యిన సందర్భంగా ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో గీతాలాప‌న కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… వందేమాతరం అంటే ‘తల్లి, నేను నీకు నమస్కరిస్తున్నాను’ అని అర్థమన్నారు. మన మాతృభూమికి అంకితమైన ఈ గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. 1870లలో బంకిమ్ చంద్ర చ‌టర్జీ బెంగాలీ భాషలో రచించిన ఈ గీతం 1882లో ఆనందమఠంలో ప్రచురితమైంది. భారత తత్వవేత్త అరబిందో గారు దీన్ని ‘బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు.

1896లో భారత జాతీయ కాంగ్రెస్ సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని మొదటిసారి పాడగా, 1905లో ఇది స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతంలోని మొదటి రెండు పద్యాలను భారత జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ పాలనలో ఇది విప్లవాత్మకంగా మారడంతో వందే మాతరం పాట, ఆనందమఠం నవల నిషేధించబడ్డాయి. 1947లో స్వాతంత్ర్య వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిషేధాన్ని రద్దు చేసింది. 1950లో రాజ్యాంగ సభ వందే మాతరంను గణతంత్ర జాతీయ గీతంగా స్వీకరించింది. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ దీన్ని జనగణమనతో సమాన గౌరవంతో పరిగణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ లు వై.నాగరాజు, యం.శ్రీనివాసరావు, టి.విజయకృష్ణ, ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, సురేష్, ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply