హైదరాబాద్ , ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ చేసిన మంచి పనులను సవివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చెయ్యనివాటిని చేసినట్లుగా గోబెల్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని, ప్రతిపక్షంలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసినదాన్ని కూడా పూర్తిగా చెప్పుకోలేకపోతుందని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి. మల్సూర్తో కలిసి మంగళవారం జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం ఆలోచనలకు అనుగుణంగా…
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో చేసినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలకు వివరించలేకపోతున్నామని అన్నారు. ఇచ్చిన హామీలనే గాక ఇతర అంశాలలో ప్రజోపయోగపనులు చేపట్టామని , 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామకాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రపధంలో నిలిపామన్నారు.
Telangana | బీసీ సంఘాలు బీజేపీ నిజస్వరూపం తెలుసుకోండి – మంత్రి పొన్నం
మహిళ సంక్షేమానికి అనేక పథకాలు
మహిళ సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టామని మంత్రి పొంగులేటి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం, మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా పెంపు, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డుల పంపిణీ ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో చేశామన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేయలేనిది ఏడాదిన్నరలో చేసి చూపించామన్నారు. పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆలోచన కూడా చేయలేదన్నారు. ఉన్న రేషన్ కార్డులలో పేర్లు కూడా నమోదు చేయలేదన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల్లో పేరు నమోదు కోసం ఎదురు చూస్తున్న 15 లక్షల మంది పేదల పేర్లను రేషన్ కార్డులలో నమోదు చేశామన్నారు. కొత్తగా ఏడు లక్షల రేషన్ కార్డులిచ్చామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది ఉన్నాకూడా పేదల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం రాజీ పడడం లేదన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లాస్ధాయిలో పౌరసంబంధాల శాఖ అధికారులదేనని ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ జగన్ డిప్యూటీ డైరెక్టర్ మధు పాల్గొన్నారు

