బహుభాషా కోవిదుడు
ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు
భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనుడు
క్లిష్ట సమయాల్లో సమర్థవంతంగా అధికార బాధ్యతలు
వంగరలోని నివాస గృహంలో పీవీ మ్యూజియం ఏర్పాటు
నేడు మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జయంతి
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : భూ సంస్కరణల ఆధ్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నారు. మౌనమునిగా కూడా ఆయనకు మరో పేరుంది. భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనుడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపడుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పీవీ నర్సింహరావు స్వగ్రామం. పీవీ నివాస గృహాన్ని అతని కుటుంబ సభ్యులు పీవీ మ్యూజయంగా మార్చారు. ఆయన వాడిన వస్తువులు, జ్ఞాపకాలు, ఫొటోలను మ్యూజియంలో పదిల పరిచారు. వంగరలో పీవీ స్మారకంగా ఏర్పాటు చేస్తున్న జ్ఞాన వేదిక నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
సాహితీ సంపన్నుడు
పీవీ బహుభాషా కోవిదుడు. నిజాం కాలంలో చదువుకున్న వారికి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, ఉర్దూ భాషల్లో సహజంగా ప్రావీణ్యం ఉంటుంది. పీవీకి మాత్రం 17 భాషల్లో ప్రావీణ్యం ఉంది. తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తమిళం, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉందని చెబుతారు. మరాఠీ నవలలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను హిందీ లోకి అనువాదం చేశారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ పుస్తకాన్ని సహస్ర ఫన్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. హరి నారాయణ ఆప్టే మరాఠీ ప్రసిద్ధ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేటా’ను అభయ జీవితం పేరుతో తెలుగులోకి పీవీ అనువదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1972 ఆగస్టు 15వ తేదీన శాసనసభలో ‘ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కొంచినాడు’ అని తన సందేశాన్ని కవితా గానం చేశాడు.
సీఎం హోదాలో అర్ధరాత్రి ఉద్వేగభరితంగా..
సమైక్య రాష్ట్రానికి పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్య రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్ధరాత్రి జరిగిన శాసనసభలో పీవీ ఉద్వేగ భరితంగా గీతాన్ని ఆలపించారు. “ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుం జముగ వెలుగుటే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ..! అనడంతో అధికార ప్రతిపక్ష పార్టీల చప్పట్లు సభ మారుమోగింది.
క్లిష్ట సమయాల్లో బాధ్యతల స్వీకరణ
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి మంచి పేరుంది. ఏ పదవిని చేపట్టిన అది ప్రజల పక్షంగానే నడిచింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా మొదలుకొని దేశ ప్రధాని వరకు ఆయన ప్రజల మనిషిగానే పనిచేశారు. ఇందిరా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఎమర్జెన్సీ తరువాత దేశమంతా కాంగ్రెస్ ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ జెండాను రెప రెపలాడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ కు రావడం వెనుక పీవీ పాత్ర కీలకం అని చెబుతారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అతని బహుముఖ ప్రతిభ సామర్థ్యాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. పీవీకి రాని భాష లేదు.. తెలియని విద్య లేదు.. సుమారు 17 భాషల వరకు అనర్గళంగా మాట్లాడగల దిట్ట పీవీ. కవి, రచయిత, అనువాదకుడు, కథకుడు, పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ.
పీవీ సాధించిన విజయాల్లో కొన్ని
= పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలు దివాలా స్థాయికి చేరుకుని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారింది. ఆ సమయంలో పీవీ తన శక్తి యుక్తులు, రాజకీయ చతురతతో సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసి పునరుజ్జీవం కల్పించారు. దీంతో పీవీకి ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పేరు వచ్చింది.
= పంజాబ్ తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత పివికే దక్కుతుంది
= దేశంలో అనుపరీక్షలు మొదలుపెట్టింది పీవీ సర్కారే
= పీవీపై గౌరవంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకంగా కేంద్ర మానవ వనరుల శాఖను ఆయన కోసమే ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పీవీ ప్రజల కోసం వినియోగించారు.
భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
భారత ప్రభుత్వం గతేడాది పీవీని ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారత ప్రధానిగా పీవీ దేశానికి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించింది. కాగా , హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరలో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.