హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ‘‘అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రాంతం గొప్ప చరిత్ర గల గడ్డ అని ఆయన గుర్తు చేస్తూ, నిజాంలు, రాజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరులు ఇక్కడ పుట్టారని కొనియాడారు.
అదే పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం రూపుదిద్దుకుందని ఆయన గుర్తు చేశారు.అయితే, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాప్తి విషయంలో తమ ప్రభుత్వం గట్టి వైఖరితో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
“మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మాదకద్రవ్యాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం… గంజాయి, మాదకద్రవ్యాల గురించి ఆలోచిస్తే వెన్ను విరిచేస్తాము అని హెచ్చరించాము” అని సీఎం రేవంత్ అన్నారు. ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణలో పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ వ్యాప్తి ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
దేశ జనాభాలో 68 శాతం యువత ఉండగా, ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారత్ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నాయని, పంజాబ్ లో గంజాయి, డ్రగ్స్ వల్ల యువత ఎలా నష్టపోయిందో గుర్తు చేశారు. అలాంటి పరిణామాలు తెలంగాణలో జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
తమ ప్రభుత్వంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం, యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. “నల్లమల నుంచి వచ్చిన నేను జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. అలాగే విజయ్ దేవరకొండ కూడా నల్లమలనుంచి వచ్చి హీరో అయ్యాడు. కష్టం, కమిట్మెంట్ ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చు” అంటూ యువతకు ప్రేరణనిచ్చారు.
మాదకద్రవ్యాల నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన సీఎం, “నో డ్రగ్స్ కు మీరు వారధులుగా మారండి” అంటూ యువతను ఉద్దేశించి పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని, విద్యార్థుల వ్యవహార శైలిని గమనించి, వారి పై మానవీయ పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో TGNABను ఇకపై EAGLE (Elite Action Group for Drug Law Enforcement)గా పునఃఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రత్యేక బృందం తెలంగాణలో ఎక్కడైనా గంజాయి పండించినా, అక్రమ రవాణా జరిగినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నారు.
చదువులో, క్రీడలలో రాణించి యువత హీరోలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కేవలం ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయి, డ్రగ్స్ వేదికగా మారకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి డ్రగ్స్ నిర్మూలనకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మీరు – మేము – మనం కలిస్తేనే ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దగలమని” ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.