New rule | కేంద్రం కొత్త రూల్.. పాత బండ్ల‌కు ఇక నో పెట్రోల్-డిజిల్ !

వాహనదారులకు అలర్ట్. 2025 జూలై 1 నుంచి పాత వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడం నిషేధం. ఈ నయా రూల్ కనుక అమల్లోకి వస్తే, ఆటో మొబైల్ రంగంలో సేల్స్ పెరుగుతాయి. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో భారీగా ఆదాయం చేకూరుతుంది. అయితే దీని వల్ల చిన్నచిన్న వ్యాపారులు, సాధారణ కార్మికులు, మధ్య తరగతి కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశ రాజధాని నగరం దిల్లీలో 2025 జూలై 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అందువల్ల పాత వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్-ప్లేట్ రికగ్నిషన్​ (ఏఎన్​పీఆర్​) కెమెరాలు ఉంటాయి. ఇవి వాహన డేటా బేస్​ను సులువుగా గుర్తిస్తాయి. కనుక బంకు వాళ్లు పాత వాహనాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంధనం నింపడానికి వీలుపడదు.

ఆటో సేల్స్ పెరుగుతాయ్​- ప్రభుత్వానికి పన్నులు వస్తాయ్​
కొత్త రూల్స్ వల్ల జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్​సీఆర్​)లోని సుమారు 1.8 మిలియన్ల ఫోర్​-వీలర్స్​, 4.4 మిలియన్ల ద్విచక్ర వాహనాలు ప్రభావితం కానున్నాయి. అంతేకాదు నోయిడా, గురుగ్రామ్​, ఘజియాబాద్​ మొదలైన కీలక పట్టణ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్​ (జీటీఆర్​ఐ) నివేదిక ప్రకారం, 1.8 మిలియన్ పాత వాహనాలను కొత్త వాటితో భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే పాత కార్ల స్థానంలో సగటున రూ.15 లక్షల ధర కలిగిన కొత్త కార్లను కొంటే, ఆటో పరిశ్రమకు రూ.2.7 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్​టీ, కంపెన్సేషన్ సెస్​ (ఎక్స్​-షోరూం ధరలో 55 శాతం) రూపంలో సుమారుగా రూ.1,35,000 కోట్లు ఆదాయం వస్తుంది. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్డు పన్నులు, డీజిల్ సర్​ఛార్జీల రూపంలో దాదాపు రూ.42,187 కోట్లు మేర ఆదాయం చేకూరుతుంది. ఇక 4.4 మిలియన్ల పాత టూ-వీలర్​లను కొత్త వాటితో భర్తీ చేస్తే, ఆ ఆదాయం మరింత భారీగా ఉంటుంది.

కాలుష్య నివారణ కోసం
దిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. కనుక గాలి నాణ్యతను పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కాలుష్య నియంత్రణ (పీయూసీ) సర్టిఫికెట్లపై ఆధారపడకూడదని దిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే అవి పాతవి. పైగా వాటిని సులభంగా మానిఫ్యులేట్​ చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు.

ఇతర దేశాల్లో పాత వాహనాలను ఏం చేస్తారు?
అభివృద్ధి చెందిన దేశాలు తమ పాత వాహనాలను ఒక పద్ధతి ప్రకారం, రోడ్ల మీదకు రాకుండా నివారిస్తాయి. వాహనాలను ఉద్గార ప్రమాణాలు, రహదారి యోగ్యత తనిఖీలు చేస్తాయి. అధిక-కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా తొలగిస్తాయి. అంతేకానీ వాహనాల వయస్సును ప్రామాణికంగా తీసుకోవు. ముఖ్యంగా అమెరికాలో వాహనం వయస్సును ప్రామాణికంగా తీసుకోరు. కాలిఫోర్నియాలో స్మోగ్ చెక్ చేసి, వాహనాలు రోడ్డు మీద తిరగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.

లండన్​, పారిస్​, బెర్లిన్​లో తక్కువ ఉద్గార మండలం (ఎల్​ఈజెడ్​), అతితక్కువ ఉద్గార మండలం (యూఎల్​ఈజీ) ఆధారంగా పాత వాహనాలను నిషేధించడం లేదా భారీ రుసుములు వసూలు చేయడం గానీ చేస్తారు. జర్మనీలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న అన్ని కార్లకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత కఠినమైన రహదారి యోగ్యత, ఉద్గార పరీక్షలను చేస్తారు. అందులో పాస్ అయితేనే వాటిని రోడ్డు మీదకు అనుమతిస్తారు.

ఇతర రాష్ట్రాలూ ఇదే పని చేస్తే!
దిల్లీ సర్కారు నిర్ణయంపై జీటీఆర్​ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘కొత్త విధానం వల్ల పేదలకు నష్టం చేకూరుతుంది. కనుక వాహనాలను ఆధునీకరించాలని భావిస్తే, యూరప్​, యూఎస్ తరహా పద్ధతులను అవలంభించాలి. కఠినమైన, పారదర్శకమైన ఉద్గార పరీక్ష వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. గ్రీన్ జోన్లలో దశల వారీగా పాతవాహనాలను తొలగించాలి’ అన్నారు. ‘దిల్లీలో అమల్లోకి తేనున్న ఈ పద్ధతిని త్వరలోనే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. అయితే అది శాస్త్రీయంగా జరగాల్సి ఉంటుంది’ అని అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

Leave a Reply