న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గోదావరి-బనకచర్ల (Banakacharla ) ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్కు (C R Patil ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,(cm Revanth reddy) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, (uttam kumar reddy, ) ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (duddilla sridhar babu ) విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి బృందం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారుర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల ప్రాజెక్ట్పై అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఆర్ పాటిల్కు వివరించారు. ఆ ప్రాజెక్ట్ తెలంగాణ హక్కులకు, ముఖ్యంగా గోదావరి నది జలాలపై హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు.
తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుంది
గోదావరి నీటిని ఏపీకి ఏకపక్షంగా మళ్లించడం వల్ల తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుందని, ఇది రాష్ట్రంలోని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఎం బృందం పేర్కొంది. ఇక భద్రాచలం, మణుగూరు వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విన్నవించారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్తో ఏపీ ప్రభుత్వం గోదావరి నది జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు తోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమకు కనీస సమాచారం లేకుండానే.. ప్రాజెక్ట్కు సంబంధించి డీపీఆర్ను సీడబ్ల్యూసీకి పంపారని ఎట్టి పరిస్థితుల్లో పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ బృందం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కొరినట్లుగా సమాచారం.
కేంద్ర మంత్రి వద్ద అభ్యంతరాలు చెప్పాం : మంత్రి ఉత్తమ్
సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్పై తమ అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు వివరించామని అన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పాటిల్ కూడా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారని వివరించారు. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్ట్పై ఇంకా పూర్తి డీపీఆర్ రాలేదని చెప్పారని తెలిపారు. తమకు కృష్ణా, గోదావరి జలాల్లో 1500 టీఎంసీలకు ఎన్వోసీ ఇస్తేనే.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని.. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగం కనిపించడం లేదని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.