కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ (Congress) హైకమాండ్ ప్రొసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పుడు 18శాఖలకు గాను, 12 శాఖల మంత్రులను మాత్రమే కేబినెట్లోకి తీసుకున్నారు. మిగతా 6 శాఖలు ఏడాదిన్నర కాలంగా ఖాళీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆయా శాఖలను పర్యవేక్షిస్తూ వచ్చారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) సహా అనేక మంది ముఖ్యనేతల నుంచి హైకమాండ్ అభిప్రాయాలు తీసుకుంది.
కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆశావహులు.. వీరికి చోటు దక్కేనా?
కేబినెట్లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్సాగర్రావు, మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి రేసులో ఉన్నారు.
నల్లగొండ నుంచి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలని కొద్దిరోజుల నుంచి పలువురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు.
గ్రేటర్కు ప్రాతినిథ్యం కోసం..
రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో కచ్చితంగా ప్రాతినిథ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేసులో ఉండటంతో.. ఎలాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావాహులు అసంతృప్తి చెందకుండా మరో మూడు స్థానాలు ఖాళీ ఉంచాలని నిర్ణయించినట్టు సమాచారం.అవకాశం ఇచ్చారు కాబట్టి మిగిలిన 6 మంత్రుల శాఖలను ప్రకటిస్తారా, లేక ఓ ముగ్గరు నూతన మంత్రులను మాత్రమే క్యాబినేట్ లోకి తీసుకుని ,విస్తరణను అలా ముగించేస్తారా అనేది మరికొద్ది గంటట్లో క్లారిటీ రానుంది.