హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సుమారు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం సినీ పురస్కారాలను ప్రభుత్వం నేడు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న సీనియర్ నటి జయసుధ కలిసి ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు..
2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కీ, ద్వీతీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, తృతీయ ఉత్తమ చిత్రంగా లక్కీ బాస్కర్ కు అవార్డులు లభించాయి.. పుష్ప 2 లో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకోగా, 35 మూవీలో నటించిన నివేథా థామన్ ఉత్తమ నటి అవార్డు ఎగరేసుకుపోయింది..
ఇక ఉత్తమ దర్శకుడిగా కల్కీ దర్శకుడు నాగ్ అశ్విన్ కు లభించింది..
పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, అవార్డుల విజేతల జాబితాను నేడు వెల్లడించారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అవార్డులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, జయసుధను జ్యూరీగా నియమించింది. మార్చి 13వ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించిన జ్యూరీ, వాటిని పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా రంగ ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్రానికి ఈ గద్దర్ అవార్డును అందించనున్నారు. కేవలం ఉత్తమ చిత్రాలకే కాకుండా, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పురస్కారాలు ఉంటాయి.
వీటితో పాటు, జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్లు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందజేస్తారు. యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు (డెబ్యూ ఫీచర్ ఫిల్మ్), డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు (సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్), లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్) విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి, అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా గద్దర్ పురస్కారాలు దక్కనున్నాయి. గతంలో ప్రకటించిన కాంతారావు, పైడి జయరాజ్, ఎం. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లతో ఉన్న అవార్డులను కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.